హైదరాబాద్​ లో టీకా టెస్టింగ్​ ల్యాబ్​: కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

  • పీఎం కేర్స్ నుంచి నిధుల విడుదల
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఏర్పాటు
  • టీకాల ఉత్పత్తి పెరుగుతుందని ధీమా
హైదరాబాద్ లో టీకా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ నుంచి నిధులను విడుదల చేసిందని తెలిపారు. బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు.

దేశంలో ఇప్పటిదాకా కేవలం రెండే టెస్టింగ్ ల్యాబ్ లు ఉన్నాయని, ఇప్పుడు మూడో ల్యాబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధి, పరిశోధనలో దేశానికి హైదరాబాద్ తలమానికంగా ఉందన్నారు.

హైదరాబాద్ లో ఫార్మా రంగం సమగ్రాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. దాంతో పాటు హైదరాబాద్ లో వ్యాక్సిన్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ కోసం నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

G. Kishan Reddy
Kishan Reddy
Prime Minister
PM CARES
Vaccine Testing Laboratory

More Telugu News